ఆలమూరు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 19 : తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలయాలను నిర్మించే వాళ్ళని చూస్తుంటాము. లేదా ఆలయాల నిర్మాణానికి వారి పేరున అధిక విరాళాలు ఇచ్చే వారిని చూస్తాము. కాని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సందిపూడిలో దొడ్డా సత్తిపండు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అయిదు లక్షల రూపాయలతో డెల్టా రూపశిల్పి సర్ ఆర్డర్ కాటన్ మహాశయుని భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద విశేషమేముంది చాలామంది గోదావరి జిల్లాలో ఇటువంటి విగ్రహాలను రైతు కుటుంబాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా అనుకోవచ్చు. కాని ఇతనికి సెంటు భూమి కూడా లేదు. అలాగని కౌలు వ్యవసాయం కూడా చేయడు. మరి ఎందుకు ఆయనంటే అంత అభిమానం అంటే తండ్రికిచ్చిన మాట. సత్తిపండు తండ్రి దొడ్డా వెంకయ్య కూడా వ్యవసాయం చేసేవాడు కాదు. చిన్న కుటుంబం. ఎడ్లు బండి తోలుకుంటూ జీవనం సాగించేవాడు.
అయితే ఎప్పుడూ ఈ గోదావరి జిల్లాలు పచ్చదనంతో విరాజిల్లుతున్నాయంటే అందుకు ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టిన కాటన్ దేవుడేనని, ఎప్పుటికైనా సంధిపూడిలో ఆయన విగ్రహం కట్టాలని చెబుతుండేవాడు. అదే సత్తిపండులో నాటుకు పోయింది. తల్లిదండ్రులు వెంకయ్య, భూలోకం జ్ఞాపకార్ధం ఎప్పటికైనా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈయనది కూడా చిన్న కుటుంబం. ఇటుకల అమ్మకాలు చేస్తుంటాడు. సొంతంగా ఇటుక బట్టి కూడా లేదు. అయినప్పటికీ తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసిన అనంతరం ఈ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నాడు.
అయితే ఆర్థికం స్థోమత అంతగాలేని సత్తిపండు ఈ పెద్ద కార్యక్రమం చేస్తుండటంతో పలువురు దాతలు ముందుకు వచ్చి రూ.2లక్షలు వరకూ విరాళాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే అతను తీసుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సొంతంగా ఈ భారీ విగ్రహాన్ని నిర్మించి అక్కడ చిన్న పార్కును కూడా ఏర్పాటు చేసారు. విదేశీయుడైన కాటన్ చేసిన మేలుకు విగ్రహం ఏర్పాటు చేసిన తీరు ఇప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గోదారోళ్ల మమకారం అంటే ఇలాగే ఉంటుందని సత్తిపండు చాటి చెప్పాడని పలువురు ప్రశంసిస్తున్నారు.













Leave a Reply