హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, మార్చి 08 : మహిళలే సృష్టికి మూలమని, సృష్టి నిర్మాణానికి కారణమని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు అబిడ్స్ లోని హీర హాల్, శ్రీ సింది గురు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షురాలు వేమూరి లక్ష్మి కాంతి, ప్రముఖ వైద్యురాలు, గైనకాలజిస్, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్.హరిప్రియ, సైకాలజిస్ట్ డాక్టర్ టి.శాంతిశ్రీ, తెలంగాణ బాలుర మరియు బాలికల బాస్కెట్ బాల్ కోచ్ ఎ.ఎస్. శైలజా అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ లను ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

అనంతరం రియల్ స్పేస్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఛైర్మన్ కొండబత్తిన శివ నారాయణ ముద్రించిన క్యాలెండర్ ను డాక్టర్ ఉమర్ ఆలీషా ఆవిష్కరించారు. జోరా డిజైన్ స్టూడియో వారిచే వస్త్ర దుకాణం, ప్రకృతి మాతృ ఆర్గానిక్ ఫుడ్స్ వారిచే తినుబండారాల స్టాల్, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హోమియో వైద్య శిబిరం, ఎస్.బి. ఐ బ్యాంక్ వారు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత సహస్ర చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన అత్త కోడళ్ల స్కిట్ చూపరులను ఆకట్టుకుంది.

దాత్రక్ మోడల్ స్కూల్ లో చదువుతున్న 8, 9 తరగతి విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విభిన్న రాష్ట్రాల సంప్రదాయ వస్త్రధారణతో ఏర్పాటు చేసిన ర్యాంపు వాక్ అందరిని అలరించింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళలకు చేస్తున్న సేవలకు సంబంధించిన ఏవీని సభలో ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను వేదికపై ఆహ్వానించగా వేదికను అలంకరించారు. జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. డాక్టర్ షేక్ ఖాజా ఇంద్దాద్ ప్రార్థన గీతం ఆలపించారు. అనంతరం అతిథులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ తల్లి దండ్రులను మించిన దైవం లేదన్నారు. స్త్రీకి సముచిత స్థానం కల్పించి, గౌరవించుకోవాలన్నారు.

తాటికొండ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, అభ్యున్నతి గురించి.. అన్ని రంగాల్లో మహిళలు ముందుటం గురించి సభకు చక్కగా వివరించారు. మహిళలు ఎక్కడా తగ్గేది లేదని, ప్రతి ఒక్కరూ ఒక స్త్రీ శక్తి అవ్వాలని కోరారు. మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించగలరని ఆమె తెలిపారు.

అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కట్టా లక్ష్మికి ఫర్జానా ఆలీషా విశిష్ట పురస్కారంతో సత్కరించారు. పలు రంగాలలో ప్రతిభకనబరిచిన మహిళలకు పురస్కారాలను డాక్టర్ ఉమర్ ఆలీషా అందించారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.













Leave a Reply