– రైతుల అవగాహన కోసమే వర్క్ షాపులు
– దేవరపల్లి వర్క్ షాప్ లో యువనేత బండారు సంజీవ్
కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 03 : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తద్వారా దేశం బాగుపడుతుందనేది కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని యువనాయకుడు బండారు సంజీవ్ అన్నారు. బుధవారం దేవరపల్లి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రబీ, ఖరీఫ్, రబీ వరుసగా మూడు పంట కాలాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడి, దిగుబడులు, లాభనష్టాల అంచనాకు వ్యవసాయ అధికారులు రానున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకం కలిపి రెండు విడతల్లో రైతులు ఖాతాల్లో రూ.14వేలను జమ చేయడం జరిగిందన్నారు. త్వరలో మూడో విడతలో మిగిలిన రూ.6వేలను జమ చేయడం జరుగుతుందన్నారు.
కోనసీమలో మన నియోజకవర్గంలో వరి, అరటి కొబ్బరి ప్రధాన పంటలుగా ఉన్నాయని, వాటికి అనుబంధంగా స్మాల్ స్కేల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రాయతీలు ఇస్తుందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు ప్రధానంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచుకొని ఆ దిశగా కృషి చేయాలన్నారు. స్థానిక నాయకులు రహదారుల అభివృద్ధి కోసం అడిగారని ఈ అంశాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు దృష్టికి తీసుకుని వెళ్లి తప్పకుండా రహదారుల అభివృద్ధి సైతం కృషి చేస్తానన్నారు.













Leave a Reply